పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒత్తిడి ఎదురవడం సర్వ సాధారణమైన విషయం. ఈ ఒత్తిడిని జయించేందుకే ప్రధాని మోడీ ప్రతీ ఏటా ‘పరీక్షా పే చర్చ‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు చిట్కాలు, ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే మెలకువల గురించి ప్రధాని వివరిస్తూ ఉంటారు. అలాగే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఈ నెల జనవరి 27వ తేదీన విద్యార్థులతో మోడీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని తల్కటరా స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనే విద్యార్థులు 9 నుంచి 12వ తరగతి చదువుతున్న వారై ఉండాలి. కేవలం విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. సుమారు రెండు వేలకుపైగా మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఎన్సీఆర్టీఏ తరఫున సర్టిఫికేట్ తో పాటు ‘ఎగ్జామ్స్ వారియర్స్’ అనే పుస్తకాన్ని అందిస్తారు.
ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలో బోర్డు పరీక్షలకు చేరుకుంటున్న విద్యార్థుల కోసం ఒత్తిడిని తగ్గించే చిట్కాలు ఉంటాయి. ఈ పుస్తకం తాజా ఎడిషన్ 13 భాషల్లో అందుబాటులో ఉంది. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మీరూ వర్చువల్ పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను ప్రధానిని అడిగే వీలు కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను ప్రధానమంత్రిని అడుగుదామని అనుకుంటే HD క్వాలిటీ వీడియోని pibhyderabad@gmail.com మెయిల్ ఐడికీ పంపించాల్సి ఉంటుంది.
ఈ ‘పరీక్షా పే చర్చ 2023’ కార్యక్రమంలో కొందరు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో దేశ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కొన్ని పోటీలను పెట్టి.. విజేతలైన వారికి మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్ లో విద్యార్థులు వీక్షించే విధంగా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు బీజేపీ కమిటీ కూడా వేసింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండాలోనూ ఈ అంశాన్ని చేర్చింది.