ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల దృష్ట్యా జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్తారు. రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ లో తలపెట్టిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
జులై 2, 3 తేదీల్లో నగరంలో జరిగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతలందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యం వహించనున్నారు. నడ్డా జులై 1నే హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమావేశాలకు వేదికగా నిలుస్తున్న నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని బిజెపి తెలంగాణ నేతలు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగనుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా, చేయాల్సిన తీర్మానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
మరోవైపు జులై 2 ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి జులై 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయి. జులై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని తరలించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.
జులై 2,3 తేదీల్లో ప్రధాని నగరంలోనే ఉండి రాజ్భవన్లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్కు వెళ్తారు. అజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించునున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.