తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడంతో పాటు, దూషించారంటూ డీఎస్పీ భక్తవత్సలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఫిర్యాదు నేపథ్యంలో చంద్రబాబు, మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదైంది. సెక్షన్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
శుక్రవారం చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు రోడ్ షోకి అనుమతి లేదంటూ బలభద్రపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చంద్రబాబు వాహనం దిగి కాలినడకన 7 కిలోమీటర్లు ప్రయాణించి అనపర్తి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు తన మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు.
కాగా వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారని ఆరోపించారు. సభ నిర్వహణకు ముందురోజు అనుమతి ఇచ్చి, అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారన్నారు. అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించారు చంద్రబాబు.
పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. సైకో ముఖ్యమంత్రి పాలనలో ఈ రాష్ట్రానికి అధోగతి పట్టిందంటూ దుయ్యబట్టారు.