హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ సాత్విక్ కేసులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సాత్విక్ ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న అడ్మిన్ ప్రిన్సిపాల్ నర్సింహాచారి సాత్విక్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా దూషించారని తెలుస్తోంది. వాచ్ మెన్ గా కూడా పనికిరావంటూ ప్రిన్సిపాల్ హేళన చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.
ఇంతకీ రిమాండ్ రిపోర్టులో ఏముందంటే.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ ను ప్రిన్సిపాల్ శివరామకృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ జగన్ మానసిక, శారీరక చిత్ర హింసలకు గురిచేశారు. అంతేకాకుండా కులం పేరుతో దూషించేవారు. సాత్విక్ కు మార్కులు తక్కువగా వస్తే ఐదారు గంటలు బయట నిలబెట్టేవాడు వైస్ ప్రిన్సిపాల్ జగన్.
సాత్విక్ స్నానం చేస్తుంటే వార్డెన్ నరేష్ టాప్ బంద్ చేసేవాడు. సాత్విక్ నీళ్లు తాగుతుంటే బాటిల్ లాక్కునేవాడు. అయితే సాత్విక్ కాలేజీలో చేరినప్పటి నుంచి నీటి సమస్య ఉందంటూ ఫిర్యాదులు చేస్తున్నాడు. దీంతో వార్డెన్ నరేష్ టార్గెట్ చేశాడని.. మిగతా సిబ్బందిని కూడా అతడిపై ఉసిగొల్పాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అయితే కాలేజీలో తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తన సోదరుడికి సాత్విక్ చెప్పినట్లు తెలుస్తోంది. అటు సాత్విక్ తన సూసైడ్ నోట్ లో తన మరణానికి కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపల్ అకలంకం నర్సింహాచారి, ప్రిన్సిపల్ తియ్యగురు శివరామకృష్ణారెడ్డి, హాస్టల్ వార్డెన్ నరేష్, వైస్ ప్రిన్సిపల్ ఒంటెల శోభాబు కారణమని పేర్కొన్నాడు. వీరంతా తనను మానసికంగా వేధించారని చెప్పాడు. తీవ్రంగాకొట్టి చిత్రహింసలకు గురి చేసేవారని వివరించాడు.