టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారు జామున కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పంత్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. అయితే ప్రమాదం జరగడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. `పంత్ అతి వేగంతో కారు నడిపాడని, అందుకే ప్రమాదం జరిగిందని కొన్ని మీడియా కథనాలలో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు. అయితే ఈ వాదనలన్నింటినీ ఉత్తరాఖండ్ పోలీసులు ఖండించారు. పంత్ తాగి కారు నడిపి ఉంటే అంత దూరం ఎలా వస్తాడని.. ఇవన్నీ తప్పుడు వార్తలని.. ఎవరు నమ్మొద్దని.. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా హరిద్వార్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ, ‘మేము నర్సన్ సరిహద్దులోని కెమెరాలను 8 నుండి 10 సార్లు తనిఖీ చేశాం. ఒకవేళ అతను మద్యం సేవించి ఉంటే ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరం ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా కారు ఎలా నడపగలడు? కారు ప్రమాదానికి గురైనప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించాడు.
పంత్ మద్యం సేవించలేదు కాబట్టే ప్రమాదానికి గురైన వెంటనే కారు లోంచి బయటకు రాగలిగాడు. ఆ టైమ్లో తాగినవాళ్లు కారు నుంచి బయటకు రాలేరు. పైగా పంత్ను రక్షించిన బస్ డ్రైవర్తో కూడా పంత్ మాములుగానే మాట్లాడడం సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యింది. ఇక జాతీయ రహదారిపై గంటకు 80 కి.మీ వేగ పరిమితి ఉండగా పంత్ తన కారును ఎక్కడా 80 కిలోమీటర్ల వేగ పరిమితికి మించి నడపలేదు. మా సాంకేతిక బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. పంత్ అతివేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పడానికి మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
నిద్రపోవడం వల్లే పంత్కు ప్రమాదం జరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు అని హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. కాగా ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. ముఖానికి తీవ్రంగా గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అతను ఇప్పట్లో మైదానంలో కనిపించే అవకాశం లేదు.