రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ ప్రధాని మోడీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీని తుకుడే.. తుకుడే పార్టీ అని మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య. ప్రధాని వ్యాఖ్యలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఒప్పుకున్నందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు పొన్నాల. గతంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు.
సామాన్యులకు మోడీ చేసిన అభివృద్ధి శూన్యమన్న పొన్నాల.. వ్యాపారవేత్తలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదని గుర్తు చేశారు. చమురు ధరలు విపరీతంగా పెంచి, సామాన్యుల నడ్డి విడిచిన చరిత్ర మోడీదని మండిపడ్డారు.
చప్పట్లు కొడితే, దీపాలు వెలిగిస్తే కరోనా ఆగిందా? అని ప్రధానిని నిలదీశారు పొన్నాల. ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ అని.. రుణమాఫీ చేసి, మద్దతు ధరపై కమిషన్ వేసిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.