భారత చిత్రసీమలో తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది అందాల బ్యూటీ పూజా హెగ్డే. అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించిన ఆమె.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాన్ ఇండియా నటిగా క్రేజ్ ను సంపాధించుకుంది. దీంతో వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. పైగా.. ఈమె పట్టిన ప్రతీ ప్రాజెక్టూ హిట్టేనని టాక్ ఉండడంతో.. ఈమెనే ప్రధానంగా తమ సినిమాల్లో తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ ఎగబడుతున్నారు.
అయితే.. కొందరు ఆమెను లక్కీ చార్మ్ గా భావించి, రిపీటెడ్ గా తమ సినిమాల్లో తీసుకుంటున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఫిల్మ్ మేకర్స్ లో హరీశ్ శంకర్ కూడా ఉన్నారు. దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేశ్ సినిమాలు మంచి విజయాలు నమోదు చేయడంతో.. పవన్ కళ్యాణ్ తో చేయనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలోనూ ఆమెనే కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు హరీశ్.
అందుకు సంబంధించి ఇప్పటికే ఒప్పందాలన్నీ జరిగిపోయాయి. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తే, అప్పుడు తాను షూట్ లో పాల్గొనడానికి రెడీ అన్నట్టుగా పూజా హెగ్డే డీల్ కుదుర్చుకుంది. కానీ.. ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యమవడం.. అందుకు తగినట్టు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వంటి పలు కారణాలతో.. పూజా తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో.. మేకర్స్ మరో కథానాయిక కోసం వెతుకులాట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
కాగా.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాలో.. పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నట్టు రీసెంట్ గానే హరీశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.