ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము నేడు భారత రాష్ట్రపతిగా ప్రమాణం చేయనుండడంతో అదే రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరీ తీరంలో తనదైన శైలిలో ఓ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ద్రౌపది ముర్ముకు ఆయన ఒడిశాలోని పూరీ బీచ్లో ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపారు.
భారత దేశ ప్రజల రాష్ట్రపతి అని ఆయన పేర్కొన్నారు. భారత్తో పాటు ఒడిశా సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.కాగా, ద్రౌపది ముర్ముకు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.
ప్రతిపక్ష పార్టీ తరఫున రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసిన యశ్వంత్ సిన్హా కూడా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ‘టీచర్ నుంచి రాష్ట్రపతి’ వరకు ద్రౌపది ముర్ము అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్థానాన్ని దేశంలోని ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు.
ద్రౌపది ముర్ము ఎన్నికైన రోజున కూడా ఈ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇసుక ఆర్ట్ ను వేశాడు.