ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణ హైకోర్టు ఈనెల 27 కు వాయిదా వేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య ఐఏఎస్, ఐపీఎస్ ల క్యాడర్ కేటాయింపుపై వివాదం నెలకొంది. డీజీపీ అంజనీ కుమార్ సహా 13 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్ కేటాయింపుకు సంబంధించిన వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
2016లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ 2017 లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీకు కేటాయించిన బ్యూరోక్రాట్లు తెలంగాణలో కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కేసును లీడ్ కేసుగా స్వీకరించిన హైకోర్టు.. ఆయన ఏపీకి వెళ్లాల్సిందే అని తీర్పు ఇచ్చింది.
ఈ క్రమంలో మిగతా అధికారుల కేసులు ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిల్ ఉజ్జల్ భూయాస్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ వేరు వేరుగా తీర్పులు వెలువరించిందని అభిప్రాయపడిన సీజే అన్ని పిటిషన్లను రెగ్యులర్ బెంజ్ విచారిస్తుందని సూచించారు.
ఈ సందర్భంగా కేసులో వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 27 కు వాయిదా వేసింది. కాగా కేసులు ఉన్న అధికారుల జాబితాలో ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్ మరో ఐపీఎస్ అధికారిణి అభిలాష్ భిష్ణు, ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి,వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఎం.ప్రశాంతి, అనంత రాములు తదితరులున్నారు. ఈ రోజు కోర్టుకు పి. కే మహంతి, అభిషేక్ మహంతి, ఐఏఎస్ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు.