లేడీ సూపర్ స్టార్గా ఎంతో పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో ఎన్నో చిత్రాల్లో గ్లామర్ షో చేసిన ఈ అందాల భామ.. విగ్నేష్ శివన్తో ప్రేమలో పడినప్పటి నుంచి కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. అన్నీ సక్రమంగానే సాగుతున్నాయనుకుంటున్న సమయంలో విమర్శలు ఎదుర్కొంటోంది నయన.
తాజాగా.. ప్రభుదేవా భార్య రామ్లాత్.. నయనతార గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త ప్రభుదేవాతో ప్రేమను నటించి తన కాపురంలో నిప్పులు పోసిందని ఆరోపించింది. తన బతుకు రోడ్డున పడేందుకు కారణం నయనతార అని.. తన భర్తను తనకు దూరం చేసిందని పేర్కొంది. తన భర్త తనతో 15 ఏళ్ల నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాడని.. ఆమె కోసమే తనకు విడాకులు ఇచ్చాడని ఆమె వాపోయింది.
తమ జీవితాల్లో ఆమె చిచ్చు పెట్టిందని పేర్కొంది రామ్లాత్. తన భర్త తనను దేవతలా చూసుకునేవాడని.. ఆమె మాయలో పడి తనకు విడాకులు ఇచ్చాడని ఆరోపణలు చేసింది. నయన ను ఏ దేవుడు క్షమించడని.. నయనతార తనకు కనిపిస్తే మాత్రం కచ్చితంగా కొడతానని రామ్లాత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నయనతార పెళ్లి నేపథ్యంలో రామ్లాత్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతూ తమ పని తాము చేస్తున్నారు.
అయితే.. విగ్నేష్ శివన్ ను నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్న నయనతార ఎట్టకేలకు వివాహం చేసుకుంది. వీరి వివాహం సెలబ్రిటీల మధ్య మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్ హోటల్లో ఘనంగా జరిగింది. అయితే.. విగ్నేష్ తో ప్రేమలో పడకముందు నయనతార ప్రభుదేవాను ప్రేమించింది. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య రామ్లాత్ కు విడాకులు కూడా ఇచ్చాడు. ఈ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. పీటల వరకు వచ్చిన వారి పెళ్లి ఆగిపోయింది. తరువాత ఆమె మళ్లీ యథావిధిగా సినిమాలు చేసుకుంటూ కొంతకాలం గడిపింది. అనంతరం విగ్నేష్ శివన్తో ప్రేమలో పడింది. ఆ సమయంలో కూడా రామ్లాత్.. నయనతార గురించి సంచలన ఆరోపణలు చేసింది.