కేఎంసీ విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేసులో ఫోరెన్సిక్ నివేదిక సంచలనం రేపుతోంది. ప్రీతి బాడీలో ఎలాంటి విషవాయువులు లేవంటూ ఫోరెన్సిక్ బృందం తన రిపోర్ట్ లో పేర్కొంది. అయితే.. దీంతో ప్రీతి ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీసులు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ఫోరెన్సిక్ రిపోర్టుతో తేటతెల్లమైంది.
ఈ నేపథ్యంలో ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అంటూ వాదిస్తూ వస్తున్న వారి మాటే నిజమైందనే విషయం తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన తాజా నివేదికతో ప్రీతిది హత్యేననే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నట్లు సమాచారం. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ వెల్లడించింది.
ఇది ఇలా ఉంటే.. ఈ రిపోర్ట్ పై ఆమె సోదరుడు పృథ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు రిపోర్ట్ వచ్చినట్టు తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. పోలీసులు కానీ, ఇంకెవరూ కానీ తమకు చెప్పలేదని, మీడియా వార్తల ద్వారానే తమకు తెలిసిందన్నారు. ప్రీతి గుండె, కాలేయంలో ఎలాంటి విషపూరితం లేవంటున్నారని, ప్రీతిని ఆస్పత్రిలో సాయంత్రం 4 గంటలకు చేర్పిస్తే.. ఆ రోజు రాత్రి 2 గంటలకు సర్జరీ చేశారని చెప్పారు.
తన కడుపులో కాటన్ తో క్లీన్ చేయడం తాను చూశానని పృథ్వీ తెలిపారు. బ్లడ్ ఎక్కించి, ప్లేట్ లెట్స్ ఎక్కించిన తర్వాత ఎక్మో పెట్టి బ్లడ్ సాంపిల్స్ తీసుకున్నారన్నారు. తన స్టమక్ ను ఏం లేకుండా మొత్తం క్లీన్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత బాడీని పంపితే.. ఇదే రిజల్ట్ వస్తుందని తాను ముందే చెప్పానన్నారు. ప్రీతి కేసును అనుమానాస్పద కేసుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పోలీసులపై తమకు చాలా నమ్మకముందన్న ఆయన.. కానీ ప్రీతి ఫోన్ నుంచి లాస్ట్ కాల్ ఉదయం 3 గంటలకు వెళ్లిందని, తన తండ్రికి రాత్రి 8 గంటలకు వచ్చిందని.. ఈ మధ్య గ్యాప్ లో ఏం జరిగిందన్న విషయం మాత్రం తమకు చెప్పట్లేదని వాపోయారు. అయితే ముందు నుంచీ ప్రీతిది సూసైడ్ కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు వాదిస్తుండగా.. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు.