భారత రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం, రాష్ర్టాల్లోని అసెంబ్లీ భవనాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. ఎన్నికకు ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. మొత్తం 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు అధికారులు. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో ఈ ఓటింగ్ జరగనుంది.
హైదరాబాద్ లోని అసెంబ్లీ కమిటీ హాల్ లో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్నీ సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈసీ ఇచ్చిన పెన్ను ద్వారా మాత్రమే సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
పోలింగ్ తర్వాత రిప్రజంటేటివ్ల సమక్షంలో బ్యాలెట్ పేపర్ ను సీల్ చేసి పార్లమెంట్ కి తరలిస్తారు. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 25వ తేదీన కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.