ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలైంది. వరంగల్- ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన్ను ఎదుర్కోలేక ప్రత్యర్థులు ఆయనపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. కోదండరామ్కే గెలుపు అవకాశాలు ఉన్నాయని ప్రీపోల్ సర్వేల్లో తేలడంతో.. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిన్న రాత్రి కోదండరాం.. ఫామ్హౌస్ వెళ్లి కేసీఆర్ను కలిశాడంటూ ఓ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పబ్లిసిటీ చేస్తున్నారు. టీవీ-9 లోగోతో దాన్ని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కోదండరాం తీవ్రంగా ఖండించారు.
తాను ఎవరిని కలవలేదని..కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం ( నిన్న) రాత్రి తాను హన్మకొండలోనే ఉన్నానని తెలిపారు. తమ పార్టీ రాజకీయంగా బలపడుతోందన్న అక్కసుతో కొ0దరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన గెలుపును ఓర్వలేని వారే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని… తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తామని తెలిపారు ఆయన.