కృష్ణా నదీ జలాల సమస్య పరిష్కారానికి 150 మందితో గంటపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. ఆంధ్ర ప్రదేశ్ లో బీఆర్ఎస్ పోటీ కోసం సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదంటూ విమర్శించారు.
రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా తేల్చక పోవడంపై మండిపడ్డారు. కృష్ణా తీర ప్రాంతం 78 శాతం తెలంగాణలోనే ఉంది.
కానీ రాష్ట్రానికి మాత్రం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వరద జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు నడుస్తున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల 28 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఆగిపోయిందని దుయ్యబట్టారు. ఇక విభజన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయడం లేదని.. దీంతో కేంద్రం కూడా పట్టించుకోవడం లేదన్నారు కోదండరామ్.