తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ముంగిళ్లన్నీ రంగవల్లులతో అందంగా మారాయి. అయితే మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామస్తులు ముగ్గులతో వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. ఇచ్చిన హామీ మర్చిపోయిన ఎమ్మెల్యేకు ముగ్గుల రూపంలో దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసి వార్తల్లోకి ఎక్కారు.
తాండూరు మండలం రేపల్లి గ్రామస్థలు కొన్నేళ్లుగా ఊరికి రోడ్డు కోసం పోరాటం చేస్తున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 3 నెలల్లో రోడ్డు వేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే మాట ఇచ్చి 7 నెలలు గడిచినా.. రోడ్డు మాత్రం మంజూరు కాలేదు. పైగా హామీ నెరవేర్చమని అడిగిన వారిపై 3 అక్రమ కేసులు పెట్టించాడు.
దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సంక్రాంతి ముగ్గులతో నిరసన తెలిపారు. 3 నెలల్లో రోడ్డేయిస్తానని హామీ ఇచ్చి 7 నెలలైనా ఇప్పటికి అమలు చేయించకపోగా.. ముగ్గురిపై అక్రమ కేసులు పెట్టించాడని, ఇప్పటికైనా ఆయన రోడ్డు వేయించి ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని ముగ్గు వేసి తమ నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముగ్గులు వేశారు. 3 నెలల్లో రోడ్లు వేయిస్తానన్న ఎమ్మెల్యే 7 నెలలు గడిచినా దానిని పట్టించుకోలేదని ముగ్గులో రాశారు. ప్రస్తుతం ఈ ముగ్గులు చర్చనీయాంశంగా మారాయి. మరి ఇప్పటికైనా ఎమ్మల్యే ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.