రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మరిన్ని మండలాల ఏర్పాటు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాలలో రెండోరోజు రాస్తారోకో కొనసాగుతోంది. గ్రామస్తులు వర్షం పడుతున్నా నిరసన ఆపడం లేదు. గొడుగులు పట్టుకుని బోథ్-కిన్వట్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. సోనాలను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మండలంగా చేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే ఆందోళన నిర్వహించారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సోనాలను మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
సోనాలకు మండలానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని.. వీటికి దగ్గరగా ఎన్నో ఆదివాసీ గిరిజన పల్లెలు ఉన్నాయని… ఈ పల్లె ప్రజలు బోథ్ మండల కేంద్రానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దాకా దూరం ఉందని అంటున్నారు. సరైన దారి లేక గిరిజనుల రాకపోకలకు కష్టం అవుతోందని.. వెంటనే సొనాలను మండలంగా ప్రకటించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. మండలం సాధించే వరకు రోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళనను ఆపేది లేదన్నారు.
అలాగే ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలం చేయాలని గ్రామస్థులు ధర్నా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మండలాలలో తమ ఊరి పేరు లేకపోవడంపై మల్లంపల్లి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంగా ప్రకటించాలంటూ కొందరు యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు.
ఇటు నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమను కొత్తగా ఏర్పాటు చేసిన నిజాంపేట్ మండలంలో కలుపుతున్నారని.. తమకు దూరం కష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను నారాయణఖేడ్ మండలంలోనే కొనసాగించాలని కోరుతూ గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమ గ్రామాన్ని నూతనంగా ఏర్పడ్డ నిజాంపేట్ లో కలుపొద్దని గ్రామస్థులందరూ ఏకగ్రీవ తీర్మానంతో రాసిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.