వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతిపై ఆమె సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సోదరి మృతిపై అనేక అనుమానాలున్నాయని తెలిపింది. అందరూ ఒక్కటై నా చెల్లిని చంపేశారంటూ ఆరోపించింది. పోలీసులు విచారణను మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నిజా నిజాలు నిగ్గుతేలాలని డిమాండ్ చేసింది. గిరిజన తెగకు చెందిందనే అందరూ కలిసి తన చెల్లిని ఒంటరి చేశారని పేర్కొంది ప్రీతి సోదరి పూజ.
ఏకంగా అందరూ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని తన చెల్లిపై చర్చించుకునేవారని, తోటి పీజీలు, సీనియర్లు అంతా ఒక్కటై తన చెల్లిని వేధించారని కీలక వ్యాఖ్యలు చేసింది. వేధింపుల విషయంపై హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ కు ప్రీతి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. తన చెల్లికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది ప్రీతి సోదరి పూజ.
ప్రీతి తండ్రి నరేందర్ సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హెచ్ఓడీని సైతం సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. సస్పెండ్ చేస్తేనే ప్రీతి ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. సైఫే తన కూతురికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని చెబుతున్నారు.
ప్రీతి మృతదేహాన్ని సోమవారం తెల్లవారుజామున ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం.. మొండ్రాయి గిర్నితండాకి తరలించారు. మరికాసేపట్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీతి మృతితో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.