దేశంలోనే అత్యంత ఎతైన ట్విన్ టవర్లు నేలమట్టమయ్యాయి. నోయిడా జంట టవర్లను ఆగస్టు 28న అధికారులు కూల్చివేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు వాటిని కూల్చివేశారు.
అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థ టవర్లను సురక్షితంగా కూల్చివేసింది. తాజాగా ఆ సంస్థ పూణెలో ఓ పాత బ్రిడ్జిని కూల్చివేసింది. చాందినీ చౌక్ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ఈ బ్రిడ్జిని గత అర్ధరాత్రి దాటిన తర్వాత సురక్షితంగా కూల్చివేశారు.
ఈ విషయాన్ని కలెక్టర్ రాజేశ్ దేశ్ముఖ్ తెలిపారు. నియంత్రిత పేలుడు ద్వారా వంతెనను కూల్చివేసినట్టు ఆయన వెల్లడించారు. ట్విన్ టవర్లను కూల్చి వేసిన సమయంలో ఉపయోగించిన సాంకేతికతనే ఇప్పుడు కూడా ఉపయోగించారు.
బ్రిడ్జిపై పేలుడు పదార్థాలను ‘చార్జింగ్’ విధానంలో అమర్చారు. ఆ తర్వాత వాటిని పేల్చారు. దీంతో పెద్ద ఎత్తు శబ్దం చేసుకుంటూ వంతెన కుప్పకూలింది. సుమారు100 మీటర్లకుపైగా ఎత్తున్న ట్విన్ టవర్లను 9 సెకన్లలో కూల్చివేయగా, పూణె బ్రిడ్జిని సుమారు 6 సెకన్ల సమయంలో కూల్చివేశారు.
వంతెనను కూల్చివేసిన ఈ ప్రదేశంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇక్కడ ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు. బ్రిడ్జి కూల్చివేతలో సుమారు 60 మంది నిపుణలైన వ్యక్తులు పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు.