తాను నమ్ముకున్న భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుకోవడానికి ఓ అన్నదాత భుజాన నాగలి, చేతిలో ఉరితాడుతో నిరసనకు దిగాడు. న్యాయం కోసం పోరాటాన్ని చేపట్టిన అతడు ఇందిరా పార్క్ నుంచి డీజీపీ ఆఫీస్ వరకు అర్థనగ్నంగా నడుచుకుంటూ వచ్చాడు.
తనను మోసం చేసిన వారిని శిక్షించాలని, ఒక వేళ తనదే తప్పని తేలితే నగరం నడిబొడ్డున ఉరి తీయాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ తన భూమిని స్థానిక బీఆర్ఎస్ నేతలు తప్పుడు పత్రాలు సృష్టించి అతని తమ్ముడు పేరిట రాయించారని ఆరోపించాడు.
ఈ విసషయంలో తాను స్థానిక పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ రైతు.. ఒక వేళ వారు సృష్టించిన పత్రాలు సరైనవే అయితే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఉరి తీయాలన్నాడు. లేని పక్షంలో తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు సురేందర్ డీజీపీని కలిసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకోవాలని తన సమస్య పరిష్కరించాలని కోరాడు. తనకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.