క్రికెటర్ సురేష్ రైనా మేనత్త కుటుంబంపై దాడి ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటన చేశారు. అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగా పేర్కొంటూ, వారిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ కేసులో మరో 11మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
ఆగస్టు 19న అర్ధరాత్రి పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ జిల్లాలోని థర్యాల్ గ్రామంలో డాబా మీద నిద్రిస్తోన్న రైనా మేనత్త కుటుంబంపై దాడి జరిగింది. ఈ దాడిలో రైనా మేనత్త భర్త అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వారి కొడుకు కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మేనత్త ఆశారాణి ఇంకా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. విషయం తెలిసిన వెంటనే దుబాయ్ లో ఐపీఎల్ ఆడేందుకు వెళ్లిన రైనా హుటాహుటిన ఇండియాకు తిరిగొచ్చాడు. తన కుటుంబానికి జరిగిన దాడిలో దోషులను గుర్తించి శిక్షించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా… ఆ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పఠాన్కోట్ రైల్వే స్టేషన్ సమీపంలోని చిన్న గుడిసెల్లో నివసించే వారు దాడి చేసినట్లు గుర్తించి, ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి దొంగిలించిన బంగారు ఉంగరం, మహిళలు ధరించే బంగారు గొలుసు, ఉంగరం, 1530రూపాయలు, రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మూడు నాలుగు రోజుల పాటు పఠాన్ కోట్ గురించి బాగా తెలిసిన వారితో కలిసి రెక్కీ నిర్వహించామని, టెర్రస్ మీద వారు పడుకున్నది చూసి కర్రలతో తలలపై బాది చంపేశామని నిందితులు ఒప్పుకున్నారు. ఆ తర్వాత బంగారం, డబ్బు తీసుకొని… పారిపోయామని, అవన్నీ పంచుకున్నాక మళ్లీ ఒకర్ని ఒకరం కలుసుకోలేదని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.