కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఉద్యమం చేస్తున్నారు. చలిని, ఆకలిని ఏమాత్రం లెక్క చేయకుండా ముక్త కంఠంతో కేంద్రంపై పోరాడుతున్న సమయంలో పంజాబ్ మాజీ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ రైతులకు మద్దతు పలికారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమికి గట్టి మద్దతుదారు అయిన ఆయన తన పద్మవిభూషణ్ పురస్కారాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించారు. రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు, వారి కోసం త్యాగం చేసేందుకు తన వద్ద ఏదీ లేదని విచారం వ్యక్తం చేసిన ఆయన.. రైతులకు గౌరవం దక్కని చోట తనకు గౌరవం అక్కర్లేదని స్పష్టం చేశారు.
రైతుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని, కేంద్రం గతంలో తనకు ఇచ్చిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. రైతులను మత, వేర్పాటువాద శక్తులుగా చిత్రీకరిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్ నాయకులంతా ఏకం కావాలని బాదల్ పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా అకాలీదళ్ మాజీ నేత సుఖ్దేవ్ ధిండ్సా కూడా తన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు.