రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం.. ప్రపంచ దేశాలను సంక్షోభంలో ముంచేసింది. ఎక్కడిక్కడ రావాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. వర్చువల్ వేదికగా నిర్వహించిన బ్రిక్స్ 14వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కీవ్ కు అండగా నిలుస్తున్న పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను ఎదుర్కునేందుకు సహకరించాలని బ్రిక్స్ దేశాల నేతలకు పిలుపునిచ్చారు పుతిన్.
రష్యాపై ఆంక్షలను ఉటంకిస్తూ.. ‘కొన్ని దేశాల దుష్ప్రవర్తన, స్వార్థపూరిత చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు పుతిన్. నిజాయితీ, పరస్పర ప్రయోజనకర విధానాలతో మనం ఈ స్థితి నుంచి బయటపడగలమని వ్యాఖ్యానించారు. పరస్పర సంబంధాలు మెరుగుపడేలా, బహుముఖ వ్యవస్థ స్థాపించేలా.. ‘బ్రిక్స్’ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్.
రష్యాపై ఆంక్షల విధింపునకు ఇజ్రాయెల్ ముందుకు రాకపోవడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. జెరూసలేంలోని హిబ్రూ యూనివర్సిటీ ప్రతినిధులను ఉద్దేశించి ఇజ్రాయెల్ పై జెలెన్స్కీ గరమయ్యారు. ఉక్రెయిన్ కు సైనిక సాయం నిరాకరణపై మాట్లాడుతూ.. దురాక్రమణకు గురవుతున్న ఓ బాధిత దేశాన్ని ఎందుకు ఆదుకోలేరని ప్రశ్నించారు.
యుద్ధ సమయంలో రష్యాకు.. ఇజ్రాయెల్ ఏ విధంగా సహాయపడుతోందంటూ వస్తున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని విమర్శించారు. ఇజ్రాయెల్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ.. జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెన్నెట్ రష్యా దండయాత్రను బహిరంగంగా విమర్శించలేదన్నారు.