బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన పాత కోచ్ పార్క్ కి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు కొత్త కోచ్ కోసం వేటలో ఉంది. దాదాపు నాలుగేళ్ల పాటు పార్క్ దగ్గర కోచింగ్ తీసుకుంది సింధు. ఈ విషయాన్ని పార్క్ శుక్రవారం స్పష్టం చేశాడు. ఈ ఏడాది సీజన్ గొప్పగా ప్రారంభించని నేపథ్యంలో సింధు నిర్ణయాన్ని స్వాగతిస్తూ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు తెలిపాడు కోచ్ పార్క్.
2019 వరల్డ్ ఛాంపియన్ షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ – సింధుతో ప్రయాణం మొదలైంది. ఫస్ట్ లో అతన్ని మెన్స్ సింగిల్స్ కోచ్ గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. ఆ తర్వాత అతను సింధు వ్యక్తిగత కోచ్ గా మారాడు. పార్క్ కోచింగ్ లో సింధు వరల్డ్ ఛాంపియన్ షిప్స్ గోల్డ్, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం, అలాగే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది.
అయితే ప్రస్తుతం సింధు వరుస పరాజయాలను అందుకుంటుంది. గతేడాది మడమ గాయం కారణంగా చాలా కాలం పాటు ఆమె బ్యాడ్మింటన్ కు దూరంగా ఉంది. టోక్యోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లోనూ ఆమె పాల్గొనలేదు. ఈ సంవత్సరం మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ లలో సింధు ఫస్ట్ రౌండ్లలోనే ఇంటిదారి పట్టింది. బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్ లోనూ సింధు ఆడినా.. సెమీఫైనల్లో మాత్రం ఓడిపోయింది.
ఇక సింధు కోచ్ గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ పార్క్ టే సాంగ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ మధ్య కాలంలో పీవి సింధు వైఫల్యాలకు కోచ్ గా తనదే బాధ్యత అని స్పష్టం చేశాడు. అందుకే సింధు మార్పు కోసం చూస్తోందని, ఓ కొత్త కోచ్ వేటలో ఉన్నట్లు అతను తెలిపాడు. ఆమె నిర్ణయాన్ని గౌరవించి తాను తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.