తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేసి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ సంచలనం రేపారు. ఆయన చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ వైసీపీలో కూడా కాక రేపుతోంది. ‘బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ… మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి… కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు, ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం’ అంటూ ట్వీట్ చేశారు.
పీవీపీ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే, కాసేపటి తర్వాత ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అతి త్వరలో సీఎం జగన్ తన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కావటం ఖాయమని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న సందర్భంలో, పీవీపీ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే జగన్ కూడా జైలుకు వెళ్లటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారని, అందుకే భార్య భారతికి సీఎం కుర్చీ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.
దీంతో… జగన్కు సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరైన పీవీపీ కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుండగా, ఇదే అదునుగా టీడీపీ విమర్శలను ఎక్కుపెట్టింది.
Advertisements