విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ లో సమస్య తలెత్తింది. దీంతో అధికారులతో పాటు ప్రయాణికుల్లో టెన్షన్ మొదలైంది. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుంచి సిడ్నీకి బయల్దేరిన క్వాంటాస్ విమానం క్యూఎఫ్ 144 పసిఫిక్ సముద్రంపై గగనతలంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్ లో సాంకేతిక సమస్య తెలెత్తింది. విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత ఈ సమస్య తలెత్తింది. అప్పటికే ఇంకా గంట ప్రయాణం మిగిలి ఉంది.
రెండు ఇంజిన్లు ఉండే ఈ బోయింగ్ 737 మోడల్ విమానంలో దాదాపు 145 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకొన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేడే అలెర్ట్ జారీ చేసింది. దీంతో సిడ్నీ ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ లు, ఫైరింజన్లు అత్యవసర సిబ్బందిని మోహరించారు.
ప్రాణాంతకమైన పరిస్థితుల్లో వైమానిక రంగంలో ఈ అలెర్ట్ జారీ చేస్తారు. ఇంజిన్ సమస్యతోనే ప్రయాణించి.. నిర్ణీత సమయానికంటే ముందుగానే ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమాన సిబ్బంది, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత ఇంజిన్ లో సమస్య తలెత్తిందని క్వాంటాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే అంత్యంత సుక్షితమైన ఎయిర్ లైన్స్ లలో క్వాంటాస్ ఒకటిగా పేరు గాంచింది. 70 ఏళ్లుగా ఈ సంస్థకు చెందిన విమానాలు ప్రమాదానికి గురి కాలేదు.