భారత్ వేదికగా జీ-20 సమావేశాల్లో భాగంగా ఢిల్లీకి వచ్చిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. మంత్రి జైశంకర్ అధ్యక్షతన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషీ, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్ హాజరయ్యారు. ఈ భేటీలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా క్వాడ్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రులు ప్రకటించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన చర్యలను అన్వేషించేందుకు ఈ క్వాడ్ వర్కింగ్ గ్రూప్ పని చేయనున్నట్లు తెలిపారు.
వ్యూహాత్మకంగా కీలక మన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, శాంతి కొనసాగించాలని.. చట్టాలు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కాపాడాలని.. భేటీ తర్వాత 4 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
కాగా భారత్ లో జీ20 భేటీకి చైనా విదేశాంగ మంత్రి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే క్వాడ్ దేశాలు భేటీ కావడంపై చైనా మండిపడింది. దేశాల మధ్య పరస్పర విశ్వాసం ప్రాంతీయ స్థిరత్వానికి దోహదం చేయాలని పేర్కొంది. దేశాల మధ్య జరిగే చర్చలు శాంతి, అభివృద్ధిని కొనసాగించే విధంగా ఉండాలని పేర్కొంది. దీని కోసం ఆయా దేశాలు మరింత సహకారం అందించాలని చైనా భావిస్తోందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు.