కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ మహిళ. హైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని సంజయ్గాంధీనగర్లో ఈ హత్య సంచలనం సృష్టించింది. విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూసాయి. మరిన్ని విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అందిన సమాచారం మేరకు సురేశ్ (28)తో రేణుకకు 2016లో ప్రేమ వివాహం జరిగింది. అతను ఓ ఆటోడ్రైవర్. అయితే గత కొద్దికాలంగా ఆమె చెడువ్యసనాలకు అలవాటు పడింది.నిత్యం కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద తిష్ఠ వేసేది. పరాయి వ్యక్తులతో కూడా చనువుగా వ్యవహరించేదనే ఆరోపణలున్నాయి.
కొన్ని రోజుల క్రితం బహదూర్పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్ తండాకు చెందిన అనాథ బాలికతో మాట కలిసింది. ఇద్దరి మద్య పరిచయం పెరిగింది. బాలికకు ఎవరూ లేకపోవడంతో తమ ఇంటికి తీసుకొచ్చింది. 15 రోజులుగా అందరూ కలిసుంటున్నారు.
భర్త మెప్పు పొందేందుకు ఇంట్లోనే రహస్యంగా బాలికతో అతనికి పెళ్లి చేసింది. అయితే ఆ బాలిక అతనికి దగ్గరవ్వడంతో సురేశ్..రేణుకను వదిలించుకోవాలని చూసినట్లు సమాచారం. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది.ఆ రాత్రి ముగ్గురూ కలిసి మద్యం తాగారు.
భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో బాలికతో కలిసి శాలువాను మెడకు బిగించి..అటొకరు..ఇటొకరు గట్టిగా లాగడంతో సురేశ్ ప్రాణాలు విడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం..’శవాన్ని ఓ సంచిలో పెట్టి రెండో అంతస్తు నుంచి ఇంటి ముందు రోడ్డుపై వదిలేశారు.
నేరం నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లారు. చంపిన అనంతరం సురేష్ బంధువులకు ఫోన్లు చేసి, తినేందుకు మటన్, మల్లెపూలు తీసుకురావాలని అతనిని బయటకు పంపించానని, తిరిగి రాలేదని రేణుక నమ్మబలికింది.
మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి..ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేసినట్లు అమాయకత్వం నటించింది. ఏమీ తెలియనట్లు ఠాణాకు వెళ్లి విలపించింది.’ అని పోలీసులు తెలిపారు. బంధువులు రేణుకపై అనుమానం ఉందని చెప్పడంతో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.