క్రికెట్లో ఇప్పటి వరకు చాలా మంది డబుల్ సెంచరీలు సాధించిన వారు ఉన్నారు. ఇదేమి కొత్త విషయం కాదు. కానీ వెస్టిండీస్ బ్యాటర్ రఖీమ్ కార్న్వాల్ టీ 20ల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. అట్లాంటా ఓపెన్ 2022 లీగ్లో.. అట్లాంటా ఫైర్ తరఫున బరిలోకి దిగిన అతడు స్క్వేర్ డ్రైవ్ జట్టుపై 77 బంతుల్లో 205 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
26 సిక్సులు, 17 ఫోర్లు బాదిన అతడు 266 కిపైగా స్ట్రైక్ రేట్తో పరుగులు చేయడం విశేషం. దీంతో అట్లాంటా జట్టు 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో బార్బడోస్ రాయల్స్ తరఫున బరిలోకి దిగే కార్న్వాల్ భారీ సిక్సులు బాదడంలో సిద్ధహస్తుడు.
భారీ కాయుడైన రఖీమ్ కార్న్వాల్ టీ20ల్లో డబుల్ సెంచరీ బాదిన విషయాన్ని ప్రముఖ స్టాటిషియన్ మోహన్దాస్ మీనన్ ట్వీట్ చేశారు. అట్లాంటా ఓపెన్లో గెలిచిన జట్టుకు 75 వేల డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారని మీనన్ తెలిపారు. కార్న్వాల్ షాట్లు ఆడిన వీడియోను ట్వీట్ చేసిన ‘మైనర్ లీగ్ క్రికెట్’ మీరు ఎంటర్టైన్ కాలేదా.? అని క్రికెట్ అభిమానులను అడిగింది.
ఇటీవలే కార్న్వాల్ మాట్లాడుతూ… సిక్స్లు కొట్టడం తనకు సహజంగా అలవడిందని.. తాను 360 డిగ్రీ ప్లేయర్నని చెప్పాడు. ఆత్మ విశ్వాసమే తన విజయ రహస్యమన్నాడు. షాట్ల ఎంపికపై తాను దృష్టి సారిస్తే సరిపోతుందని.. బంతి నా ఏరియాలోకి వచ్చేంత వరకు వేచి చూసి బాదితే సరిపోతుందన్నాడు. ఒక రోజు 11 సిక్సులు బాదితే.. మరో రోజు తొలి బంతికే ఔట్ కావచ్చు. కానీ ఓ ఆటగాడిగా మనపై మనకు నమ్మకం ఉండాలని కార్న్వాల్ తెలిపాడు.