సుమారు ఐదు నెలల పాటు సుదీర్ఘంగా సాగిన భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది. 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగింది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన బహిరంగ సభతో యాత్రకు కాంగ్రెస్ ముగింపు పలికింది. యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి సందడి చేశారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో రాహుల్, ప్రియాంకలు మంచు ముక్కలను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సరదాగా కనిపించారు. భారత్ జోడో యాత్రను కాంగ్రెస అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించారు.
ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల మీదుగా సాగింది. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 145 రోజుల పాటు 4వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. జోడోయాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్లోని ఎస్కే స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
సభకు భావసారుప్యత కలిగిన 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి 12 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి. ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాక్రే), జేడీయూ, సీపీఐ, వీసీకే, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్, పీడీపీ, జేఎంఎం పార్టీల నేతలు సభకు హాజరవుతారని పేర్కొన్నాయి.