ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యునికి కూడా ఒక అస్త్రంలా మారింది సోషల్ మీడియా. ఏ చిన్న సమస్య ఎదురైన.. అది మంచి అయినా చెడు అయినా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మారింది. దానికి అనుగుణంగానే అవతలి వ్యక్తులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది.
అయితే.. సాధారణ ప్రజల నుంచి రాజకీయ నేతలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ట్విట్టర్ లో అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది. ఓ మహిళ చేసిన ట్విట్ కు మంత్రి స్పందించారు.
యూపీ లోని సుల్తాన్ పూర్ కు చెందిన ఓ మహిళ ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేస్తోంది. అదే సమయంలో తన 8 నెలల చిన్నారి పాలకోసం గుక్కపట్టి ఏడ్చడం మొదలు పెట్టింది. ఎంత సముదాయించినా లాభం లేకపోయింది. కంగారు పడ్డ ఆ మహిళ.. విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
పాప ఏడుస్తోంది.. పాలు కావాలని చెప్పి రైల్వే శాఖకు ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ పాపకు పాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. భీమ్ సేన్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరి కాన్పూర్ రైల్వేస్టేషన్ కు చేరుకున్న వెంటనే అధికారులు పాప తల్లికి పాలు అందజేశారు. వెంటనే స్పందించి పాలు అందజేసిన రైల్వేశాఖ మంత్రి అశ్విన్ కుమార్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.