రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. గవర్నర్ వైఖరి పట్ల తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై తమిళిసై మండిపడ్డారు. ఈ మేరకు పరోక్షంగా గవర్నర్ చేసిన ట్వీట్ రాజకీయపరంగా దుమారం రేపుతోంది. దీంతో మరోసారి ప్రగతి భవన్, రాజ్ భవన్ ల మధ్య పంచాయతీ వార్తల్లో నిలిచింది.
గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య నెలకొన్న విభేధాల్లో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారని ధ్వజమెత్తారు.
ఈ రెండు భవన్ ల మధ్య ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. రాజ్ భవన్ ఆహ్వానిస్తుంటే ప్రగతి భవన్ అవమానించేలా వ్యవహరిస్తోందని తెలిపారు ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిట్ మోడ్ లో ఉందన్నారు. ప్రభుత్వ పాలసీలకు పక్షవాతం వచ్చిందని ఆయన ఆరోపించారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంపై స్పందిస్తూ.. దళితుల భవిష్యత్ కోర్టుల చేతుల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అధికారంతోనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.