మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు క్యాంపు కార్యాలయం నుంచి బీజేపీ శ్రేణులతో కలిసి ఇడికుడ, బంగారిగడ్డ మీదుగా.. చండూర్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు. భారీ ర్యాలీ అనంతరం నామినేషన్ వేశారు. కోమటిరెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు సహా పలువురు నేతలు ఉన్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు రాజగోపాల్. సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేసీఆర్కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈసారి మునుగోడు ఫలితాలు సీఎం చెంప చెల్లుమనేలా ఉంటాయన్నారు. నల్గొండ జిల్లా అంటేనే విప్లవాల ఖిల్లాగా పేర్కొన్న అయన.. దొంగ చాటు దెబ్బ తీసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన తట్టబుట్ట సర్దుకొని కొత్తగా కొంటున్న విమానంలో పారిపోవాలని తెలిపారు. బీజేపీ పులి లాంటి పార్టీ అని, తన గెలుపుతో కేసీఆర్ పాలనకు బొంద పెడ్తామని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. దేశంలో ఏ సీఎం పాల్పడనంతా అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని.. ఆ అవినీతి సొమ్మును మోడీ, షా కక్కిస్తారని తెలిపారు.
సీఎం వంద కోట్లు పెట్టి సొంత విమానం కొనేది దుబాయికో, సింగపూర్ కో పారిపోవడానికేనని ఆరోపించారు రాజగోపాల్. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని.. జైలుకెళ్లడం ఖాయమన్నారు. మోడీ, అమిత్ షాలకు భయపడి కేసీఆర్ విమానం కొనుగోలు చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులకు ఆశపడి తాను బీజేపీలోకి వెళ్లినట్లు టీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. తాను బీజేపీకి అమ్ముడు పోలేదని యాదగిరి లక్ష్మినరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని.. కేసీఆర్, కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.
మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ఖాయమని ఇక్కడి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. ఎన్నిసార్లు ఇక్కడి సమస్యలను లేవనెత్తినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కావడంతో తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తోందని.. ఈ ఎన్నికతో కేసీఆర్ కుటుంబ పాలన అంతమవడం ఖాయమన్నారు.