రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ఇంజినీర్కు అధికారులు షాక్ ఇచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘించినందుకు ఆమెపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ నెల 12 ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల3,4 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రోహెత్లోని స్కౌట్ గైడ్ ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో సభా ప్రాంగణంలో అందరికీ నీళ్లను అందించే బాధ్యతను ఇంజినీర్ అంబాసియాల్ అప్పగించారు.
ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఆ సమయంలో రాష్ట్రపతి అక్కడకు చేరుకోగానే ప్రొటోకాల్ ఉల్లంఘించి అంబా సియోల్ అడుగు ముందుకు వెశారు. రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ఆమె ప్రయత్నించారు.
దీంతో అక్కడే ఉన్న రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోం శాఖ నివేదిక కోరింది. ఈ క్రమంలో రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే ఆ ఇంజినీర్ను సస్పెండ్ చేసింది.