ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ చెందిన ఆయన ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేస్తున్నారు. గతంలో విజయవాడ, విశాఖ, పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. జాతీయస్థాయిలో ఆయనకు గుర్తింపు ఉంది.
ఇప్పటివరకు ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడింది. దీంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గౌతమ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా పని చేశారు. అయితే.. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ.. రాజేంద్రనాథ్ ను డీజీపీగా నియమించడం గమనార్హం.
రాజేంద్రనాథ్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అయితే.. గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం ఇంతవరకు కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక.. పీఆర్సీపై అసహనంతో ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు.
అందులో పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.