రాష్ట్రంలో టీఆర్ఎస్ నుండి ఇతరపార్టీలకు వలసలు మొదలయ్యాయి. సీనియర్ నేతలు సైతం కారు దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కారుపార్టీని వీడిన నేతలను వివిధ రకాలుగా వేధించే దిశగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ టీఆర్ఎస్ కు టాటా చేప్పనున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరికకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. అయితే.. అనుకోని కారణాలతో పలుమార్లు చేరిక వాయిదా పడుతు వస్తోంది. రేపో మాపో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ప్రగతి భవన్ లో నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో టీఆర్ఎస్ సత్తా చాటాలని, అస్సలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దని, గట్టిగా పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ ప్రస్తావన వచ్చింది.
రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం జూన్ వరకు ఉందని.. ఈలోపు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అనర్హత వేటు వేయాలన్న ప్రతిపాదనను ఎంపీలు కేసీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అనర్హత వేటు కోసం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చ తర్వాత డీఎస్ కాంగ్రెస్ లో చేరిన మరుక్షణం అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కాగా.. డీఎస్ కు టీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాతినిథ్యం లేని కారణంగా ఆయన సొంత గూటికీ వెళ్లాలని నిర్ణయించుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు కొడుకు అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి కవితపై అరవింద్ పోటీ చేశారు. అప్పటి నుంచి డీ శ్రీనివాస్ కు టీఆర్ఎస్ లో ప్రాధాన్యతను తగ్గిస్తు వచ్చారు గులాబీ బాస్ కేసీఆర్.