సంచలనం రేపిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి శిక్ష పడింది. ఈ కేసులో నాలుగేండ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ నెల 6నే ఈ కేసు విచారణ పూర్తయింది. హత్య కేసులో రాకేశ్ రెడ్దిని దోషిగా కోర్టు తేల్చింది.
తాజాగా ఈ కేసులో రాకేష్ రెడ్డికి నాం పల్లి మొదటి సెషన్స్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. అతనికి జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు 320 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో 48 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.
కోస్టల్ బ్యాంకు చైర్మన్, ఎక్స్ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరాం 2019 జనవరి 31న హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా ఛార్జ్ షీట్ లో పోలీసులు చేర్చారు. వారిలో ఏ1 నిందితుడిగా రాకేష్రెడ్డి, ఏ2గా విశాల్, శ్రీనివాస్, ఏ3గా రౌడీషీటర్ నగేష్ కీలక నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా పోలీసులు చేర్చారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడు సంతోష్ రావును కూడా సాక్షిగా చేర్చారు. ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు , వాదనలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా రాకేష్ రెడ్డికి న్యాయస్థానం శిక్ష విధించింది.