‘శ్రీరామ నవమి’ వేడుకలను ఘనంగా జరపడానికి దేశ వ్యాప్తంగా ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈసారి అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు మరింత వైభవంగా నిర్వహించనున్నారు. ఏకంగా పది రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. ఈ వేడుకల కోసం శ్రీరామ జన్మ ఉత్సవ్ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
మార్చి 30న శ్రీరామ నవమిని పురస్కరించుకుని.. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మార్చి 22 నుంచి శ్రీరామ జన్మోత్సవాన్ని ప్రారంభించనుంది. ఈ ఉత్సవాల్లో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా.. ఏడు రోజుల పాటు క్రీడా, సాంస్కృతిక ప్రోగ్రామ్స్ జరపనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి.
సైకిల్ రేస్, మారథాన్, ఖోఖో, కత్తి యుద్ధం, కబడ్డీ, బోటింగ్, వాలీబాల్, కుస్తీ లాంటి డజనుకు పైగా క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో మొదటగా మార్చి 22న సైకిల్ రేస్ ఉంటుంది. ఈ రేస్ అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఉదయం 5.30 గంటలకు మొదలవుతుంది. 21 కిలో మీటర్ల దూరంలో ఉన్న సరయూ హారతి ఘాట్ వద్ద ముగుస్తుంది.
ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో.. కథలు, కవి సమ్మేళనం, సంగీతం, భజన లాంటివి నిర్వహించనున్నారు. క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఖరీదైన బహుమతులు అందజేయనున్నారు. అనంతరం వారికి సత్కారం చేయనున్నారు. ఇలా మొత్తంగా బహుమతులకు రూ.12,45,300 ఖర్చు చేయనున్నారు.