రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతి ఈ మధ్యాహ్నం ముచ్చింతల్ ఆశ్రమంలోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. కాగా.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఆయనను స్వాగతించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఎయిర్ పోర్టుకు విచ్చేశారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టుకు రాకపోవడం.. ఇప్పుడు రావడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. కావాలనే జ్వరం అనే కారణం పెట్టుకొని ప్రధాని పర్యటనలో సీఎం పాల్గొనలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి కోసం నిరీక్షిస్తుండడాన్ని మీడియా కెమెరాలు బంధించాయి.
ప్రోటోకాల్ ప్రకారం తొలుత గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆపై సీఎం కేసీఆర్ శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతికి అందరినీ పేరుపేరునా పరిచయం చేశారు సీఎం కేసీఆర్.