టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ ఒకటి. వారి కలయికలో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్లు వచ్చాయి. ఇప్పుడు ‘రామబాణం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన ఈ జోడి హ్యాట్రిక్ పై కన్నేసింది. వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వీళ్లకు తోడైంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
‘రామబాణం’ అనే టైటిల్ ప్రకటించినప్పట్నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఇటీవల మహా శివరాత్రి కానుకగా విడుదలైన ‘విక్కీస్ ఫస్ట్ యారో’ అనే ప్రత్యేక వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ ప్రత్యేక వీడియోలో గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీవాస్ టేకింగ్, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేశాయి.
ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాని మే 5న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “విద్యార్థులందరికీ పరీక్షలు ముగిశాక వేసవిలో మిమ్మల్ని అలరించటానికి, అసలుసిసలు వినోదాన్ని పంచడానికి రామబాణం దూసుకొస్తోంది” అనే క్యాప్షన్ ను కూడా వదిలారు.
ఇందులో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ సరికొత్తగా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సామాజిక సందేశం కూడా జోడిస్తూ, బలమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కెరీర్ లో గోపీచంద్ కు ఇది 30వ చిత్రం.