చంచల్ గూడ జైలు నుంచి రామచంద్ర భారతి శుక్రవారం విడుదల అయ్యాడు. నకిలీ పాస్ పోర్ట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే గురువారం బెయిల్ పత్రాలు జైలుకు ఆలస్యంగా అందాయి.
దీంతో ఆయన్ని శుక్రవారం విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతి ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ పై బయటకు రాగానే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
రామచంద్రభారతి ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని పరిశీలించగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సమర్పించి పాస్ పోర్టు పొందినట్టు సిట్ గుర్తించింది.
దీంతో ఆయనపై మరో కేసు నమోదు చేసి, డిసెంబర్ 22న అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.