కరోనాపై భారత్ చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. దేశంలో మహమ్మారి తీవ్రం అయినప్పుడు కూడా దేశ ప్రజలకు కనీస అవసరాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని అన్నారు. ఏడాది పూర్తి కాకముందే దేశంలో 150 కోట్ల డోసులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో సంఖ్య పరంగా చైనా తరువాత భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన ఆయన జాతినుద్దేశించి ప్రసంగిచారు.
కరోనా సమయంలో కూడా సంక్షేమ, అభివృద్ధిని పక్కన పెట్టకుండా ప్రగతి సాధించామని అన్నారు. ఈ సంక్షోభం టైంలో ప్రభుత్వాలు, వైద్యులు, ఆరోగ్యకార్యకర్తలు చేసిన కృషి ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని చెప్పారు. మూడు లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదైనప్పుడు కూడా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందంటే వైద్యరంగం చలవే అని కొనియాడారు. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా 44 కోట్ల మంది పౌరులకు ప్రత్యక్ష నగదు బదిలీ జరిగిందన్నారు. ఈ ఏడాది కరోనాతో పాటు పలు అంశాల్లో విజయాలు సాధించామని గుర్తు చేశారు.
పీఎం కిసాన్ ద్వారా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలు.. సుమారు రూ.1.80 లక్షల కోట్లు ప్రయోజనం పొందాయని చెప్పారు. 24 వేల కి.మీ. మేర రైల్వే లైన్లు, 21 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు నిర్మాణం జరిగాయని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది ఆనందం వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో 7 పతకాలు సాధించిన యువత మన సామర్థ్యం ప్రపంచానికి చూపించిందని అన్నారు.
అటు, టోక్యో పారాలింపిక్స్లో కూడా భారత్ 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించిందన్నారు. క్రీడారంగ బలోపేతానికి పలు పథకాలు, సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఇప్పటివరకు 28 లక్షలమంది ఆర్థిక సాయం పొందారని చెప్పారు. భారత్మాల కింద రూ.6 లక్షల కోట్లతో 20 వేల కి.మీ. మేర ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.
Advertisements
ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు.