కమెడియన్లు హీరోలుగా మారడం, సినిమాలు చేయడం, తిరిగి తమ క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అవ్వడం కామన్. రీసెంట్ గా సునీల్ కూడా ఇదే చేశాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి రావురమేష్ కూడా చేరాడు. అవును.. రావురమేష్ హీరోగా మారాడు. ఓ సినిమా చేస్తున్నాడు.
కథలో ముందుండి, కథను ముందుకు నడిపించే నాయకుడిని కథానాయకుడు అంటారు. విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి అలాంటి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఆయన పోషించబోయేది రెగ్యులర్ హీరో రోల్ కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోంది.
రావు రమేష్ టైటిల్ పాత్రలో పీబీఆర్ సినిమాస్ బ్యానర్ పై వస్తున్న సినిమా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. ‘పుష్ప’, ‘కెజియఫ్’, ‘ధమాకా’ సినిమాల తర్వాత రావు రమేష్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ రోల్ చిత్రమిది. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్రధారి. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు.
నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో 2 గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందట ఈ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.