టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బాల్ టాంపరింగ్కు ప్రయత్నించాడంటూ ఆస్ట్రేలియా మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ స్పందించాడు. అసలు అనుమానాలకు తావిచ్చేలా జడేజా ప్రవర్తించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు బౌలింగ్ చేసేటప్పుడు రవీంద్ర జడేజా తన ఎడమ చేతి వేలికి ఆయింట్మెంట్ పూసుకోవడం చర్చనీయాంశమైంది. ఆసీస్ అభిమానులు, మీడియా జడేజాపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలూ చేశారు.
తాజాగా ఈ విషయంపై క్లార్క్ మాట్లాడుతూ.. బంతి చేతిలో ఉండకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బంతి చేతిలో ఉన్నప్పుడు క్రీమ్ను అలా రుద్దకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ‘చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లో జడేజా బౌలింగ్ వేశాడు. దీని వల్ల అతని వేలు బొప్పి కట్టడం లేకపోతే కోసుకున్నట్లు అనిపించి ఉండొచ్చు. అందుకే అతడు ఆయింట్మెంట్ పూసికొని ఉంటాడు. అయితే, ఇలా చేసే ముందు చేతిలోని బంతిని అంపైర్కు ఇచ్చి ఉండాల్సింది.
అంపైర్కు ఇచ్చేసి అతడి ముందే జడేజా ఆయింట్మెంట్ రాసుకొని ఉంటే ఇదొక చర్చనీయాంశంగా మారేది కాదు. ఇప్పటికీ నేను దీనిని పెద్ద విషయంగా పరిగణించడం లేదు. కానీ, అతడి చేతిలో బంతి లేకుండా ఉంటే బాగుండేదని మాత్రమే నేను కోరుకుంటా. ఇందులో ఏదో జరిగిందని నేను అనుకోవడం లేదు. అయితే, నా అంచనా కూడా వందశాతం తప్పు కావచ్చు” అని క్లార్క్ తెలిపాడు.
తొలుత బౌలింగ్లో ఆసీస్ను 177 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా.. బ్యాటింగ్లో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. దీంతో 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్యాటింగ్లో అర్ధశతకం సాధించిన రవీంద్ర జడేజా (66*) తొలి రోజు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.