కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 11వ సారి వరుసగా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఇప్పటికే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలోనూ ఆర్బీఐ కీలకమైన రెపో, రివర్స్ రెపో రేట్లు యథాతథంగా కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా వేశారు. వారి అంచనాలను ఆర్బీఐ మరోసారి నిజం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) నిర్వహించిన తొలి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. ఈ సారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రెపో రోటు 4 శాతం వద్ద కొనసాగుతోంది. రివర్స్ రెపో రేటును కూడా 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు వెల్లడించారు శక్తికాంతదాస్. అయితే, దేశీయంగా ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతున్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనున్నట్లు చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ(ఎంపీసీ) యథాతథ స్థితిని కొనసాగించడం ఇది వరుసగా 11వ సారి. వడ్డీ రేటును చారిత్రాత్మక కనిష్ట స్థాయికి తగ్గించడం ద్వారా డిమాండ్ను పెంచడానికి ఆర్బీఐ తన పాలసీ రెపో రేటు లేదా స్వల్పకాలిక రుణ రేటును మే 22, 2020న చివరిసారిగా సవరించింది. ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4 శాతానికి దిగొచ్చింది. ఈసారి కూడా అదే రేటు కొనసాగిస్తూ.. ద్రవ్యోల్బణం పెరుగుదల దృష్ట్యా ‘అకామడేటివ్ స్టాన్స్’ను ఆర్బీఐ మార్చుకోవచ్చని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగినట్లే శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది. ‘పునరుద్ధరణ-సుస్థిరాభివృద్ధి-ద్రవ్యోల్బణం కట్టడి’ వ్యూహంతో ముందుకు సాగనున్నట్లు స్పష్టం చేసింది.
ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన కమిటీనే.. మానిటరీ పాలసీ కమిటీగా పిలుస్తుంటారు. ప్రతి రెండు నెలలకు ఓ సారి ఈ కమిటీ సమావేశమై దేశ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కీలక వడ్డీ రేట్ల మార్పు సహా వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 6న ప్రారంభమైన ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 8 వరకు సాగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను, ఆర్థిక వ్యవస్థపై అంచనాలను గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు.
భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త, పెను సవాలును ఎదుర్కొంటోందని రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు శక్తికాంత దాస్. ఒమిక్రాన్ను సమర్థంగా ఎదుర్కోవడం వల్ల కలిగిన లాభాలను.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. అయితే, విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్బీఐ సర్వసన్నద్ధమై ఉందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.2శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. పెట్రో మంటతో ద్రవ్యోల్బణం మరింత(4.5శాతం నుంచి 5.7శాతానికి) పెరుగుతుందని, వంట నూనెల ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయని చెప్పారు శక్తికాంత దాస్. ఇక అన్ని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది ఆర్బీఐ.