అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సంస్థ మాస్టర్ కార్డ్ పై ఉన్న నిషేధాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. పేమెంట్స్ కు సంబంధించిన డేటాను భద్రపరచడంలో విఫలమైన కారణంగా.. గతేడాది జులై 14న ఆంక్షలను విధించిన ఆర్బీఐ.. ఇప్పుడు వాటిని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
ఇకపై డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్వర్క్లోకి కొత్త వినియోగదారులను చేర్చుకోవచ్చని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. కాగా.. పేమెంట్స్ కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న ఆర్బీఐ ఆదేశించింది.
ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు పాటించడంలో మాస్టర్ కార్డ్ విఫలమయ్యింది. దీంతో పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 ప్రకారం ఆర్బీఐ చర్యలు తీసుకుంది.
దీంతో కొత్త కార్డులు జారీ చేయకుండా అప్పట్లో నిషేధం విధించింది. తాజాగా.. ఈ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో వినియోగదారుల కోసం మాస్టర్ కార్డ్ త్వరలో కొత్త కార్డులను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.