న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో మద్యం అమ్మకాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 254 కోట్లు విలువైన మద్యాన్ని గోదాముల నుంచి దుకాణదారులు తీసుకెళ్లారు. ఇక ఈరోజు రాత్రి వరకు మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ అనుమతి ఇచ్చింది. బార్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఉంది. మరో వైపు నూతన సంవత్సరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారీ ఎత్తున మద్యం నిలువలను దుకాణదారులు సిద్దం చేసుకున్నారు.
ఐదు రోజుల్లో 895.55 కోట్ల విలువైన మద్యాన్ని గోదాముల నుంచి తరలించి సిద్దం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఇదే ఐదు రోజులలో కేవలం 753.99 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడుపోయింది. అంటే ఈ ఏడాది ఇప్పటికే 150 కోట్ల విలువైన మద్యం అదనంగా దుకాణదారులు, బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు నిల్వలు ఉంచుకున్నాయి.
డిసెంబర్ 2021 లో దాదాపు 3050 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా.. ఈ డిసెంబర్లో 30 వ తేదీ వరకు 3160.34 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. ఈ వేళ మరో 250 కోట్లకు పైగా విలువైన మద్యం గోదాముల నుంచి దుకాణాలకు, బార్ అండ్ రెస్టారెంట్లకు చేరే అవకాశముందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే సాధారణంగా న్యూ ఇయర్ వేడుకల కోసం ఒక గంట మాత్రమే అదనంగా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతిస్తారు. కాని ఈ సారి మాత్రం అర్థరాత్రి వరకు మద్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించడం విశేషం. దీంతో ఈ సారి డిసెంబర్ 31న మద్యం విక్రయాలు ఊహించని స్థాయిలో జరిగే అవకాశం ఉంది.