ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిణామాల నేపథ్యంలో భగ్గుమన్న వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ప్రధాన ఉత్పత్తిదారులైన ఇండోనేషియా, మలేషియాలలో ఎగుమతులపై ఆంక్షలు విధించడం వెరసిపోయాయి. పెరిగిన వంటనూనెల ధరలతో విలవిలలాడిన సామాన్య ప్రజలు.. ధరలు క్రమేణా తగ్గుముఖం పట్టడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
హోల్ సేల్ మార్కెట్లో లీటర్ వంటనూనె ధరలు రూ. 25 నుంచి రూ. 35 వరకు తగ్గాయి. జనం అధికంగా వినియోగించే పామోలిన్ ధర రూ.175 నుంచి భారీగా రూ.35 తగ్గడంతె.. వంటనూనె ధర రూ.140కి చేరింది. ఈ నెలాఖరుకు లీటర్ కు మరో రూ.10 తగ్గే అవకాశం ఉన్నట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. వంటనూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ప్రధానంగా దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది.
అలాగే అంతర్జాతీయంగా పామోలిన్ ఉత్పత్తి చేస్తున్న ఇండోనేషియా నుంచి దిగుమతులు పెరిగాయి. అదేవిధంగా మలేషియా నుంచి కూడా పామోలిన్ ఉత్పత్తి పెరిగింది. మే నెలాఖరు వరకు ఇండోనేషియా ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో అంతర్జాతీయంగా పామోలిన్ గిరాకీ ఏర్పడి ధరలు మరింత పెరిగాయి. అయితే.. ఆంక్షల నేపథ్యంలో ఇండోనేషియాలో నిల్వలు పెరిగి పోవడంతో ఆంక్షలు ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మే నెలారంభంలో ఇండోనేషియాలో టన్ను పామోలిన్ ధర రూ.6 వేల రింగిట్స్ ఉండగా.. ప్రస్తుతం టన్నుకు రూ.వెయ్యి రింగిట్స్ తగ్గి రూ.5 వేలకు పడిపోయింది. అదేవిధంగా కేంద్రం పామోలిన్ దిగుమతులపై సుంకం 44.5 శాతం నుంచి క్రమేణా.. 5 శాతంకు తగ్గించింది. ఆలాగే మిగిలిన నూనెలపై కూడా దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. ఇండోనేషియాలో ఎగుమతులపై ఆంక్షలు సడలించడం, అంతర్జాతీయంగా వంటనూనెల కొనుగోళ్లు మందగించడం, కేంద్రం దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించడంతో వంటనూనెల ధరలు తిరోగమనం పట్టాయి.