గోదావరిలో బోటు ప్రమాదంలో రోజుకో వివాదం, ఆరోపణలు ప్రభుత్వంపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తాజాగా గోదావరిలో మునిగిన బోటును గుర్తించిన వెంకట శివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజే బోటును గుర్తించామని, రన్నింగ్ పంటు, రోప్ ఇస్తే రెండు గంటల్లో బోటు తీస్తానని చెప్పానన్నారు. బోటు బయటకు తీయడం అధికారులకు ఇష్టం లేదని, పర్యాటక అధికారులు, బోటు యజమానులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

రాజమహేంద్రవరం : బోటును గుర్తించడానికి ఉత్తరాఖండ్ నిపుణులు అవసరం లేదని ఇటువంటి ప్రమాదాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించే నిపుణుడు వెంకట శివ చెబుతున్నారు. వాళ్లు తీసుకొచ్చిన కెమెరాలు అసలు సరిగా పనిచేయడమే లేదని వెంకటశివ చెప్పారు. నదుల్లో చిక్కుకున్న బోట్లను బయటకు తీయడంలో వెంకటశివ ఎక్స్పర్ట్ అని పలువురు చెబుతున్నారు. బోటు బాగోతం బయటికి వస్తే ప్రభుత్వంలో పెద్దల పునాదులు కదిలిపోతాయని శివ ఆరోపించడం అనేక సందేహాలకు తావిస్తోంది.
బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్పైనే ఆయన గురిపెట్టారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదని అన్నారు. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేవీపట్నం ఎస్సై వద్దని వారించినా కలెక్టర్, ఎస్పీకి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడంతో బోటు కదిలిందని చెప్పారు. బోటు జాడ సోమవారమే తెలిసినా కావాలని వెలికి తీయడం లేదన్నారు. ఫ్లోటింగ్ జట్టీ ద్వారా బోటు వెలికి తీయవచ్చని చెప్పారు. కానీ ఆ దిశగా ప్రయత్నించడం లేదని, గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, టూరిజం అధికారుల పెట్టుబడులున్నాయని ఆయన ఆరోపించారు. అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రమాదంపై సీనియర్ అధికారితో విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.