ఐఏఎస్, ఐపీఎస్ ల పోస్టింగులపై అభ్యంతరం తెలుపుతూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మేథావి వర్గం పరిపాలనలో భాగస్వామి అవుతుందని ఆశించామని.. కానీ.. 8 ఏళ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామన్నారు.
కీలకమైన శాఖలు బీహార్ అధికారుల చేతుల్లోనే ఉన్నాయన్నారు రేవంత్. ఆఖరికి కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్ళు, అధికారులు కూడా బీహారీలేనని లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అధికారులు నిరాదరణకు గురవుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్, 139 మంది ఐపీఎస్ లు ఉండగా బీహార్ అధికారులనే ఎందుకు అందలం ఎక్కిస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని నిలదీశారు. డీజీపీ పదవులు కూడా బీహారీ అధికారులకే ఇచ్చారన్నారు.
Advertisements
బీహార్ అధికారులకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారని.. హెచ్ఎండీఏ, రెరాలో సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఇచ్చిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జయేశ్ రంజన్ సారథ్యంలో టీఏస్ ఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపులపైనా విచారణ జరగాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్.