కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోడీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే కలలోకి వస్తున్నట్టుందని చురకలంటించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదుపై నమోదు చేసిన కేసును ఎనిమిదేళ్లుగా సాగదీస్తూ తాజాగా ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీది, బ్రిటీషు వాళ్లది ఒక్కటే భావజాలమన్న రేవంత్.. ఆనాడు అణచివేత, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ భావజాలానికి వారసులైన బీజేపీ-మోడీ అణచివేత, కుట్రలకు వ్యతిరేకంగా అంతే ఉత్తేజంతో పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆనాటి స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేడు మోడీని గద్దె దింపే ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని అన్నారు.
ఈడీ నోటీసులు కాంగ్రెస్ అగ్రనాయకత్వ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్న ఆయన… బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై తమ పోరాటాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఈ పరిణామం కార్యకర్తలలో మరింత కసి, పట్టుదలను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేధింపులతో కాంగ్రెస్ కుంగిపోతుందని భావిస్తే అది వారి భ్రమే అవుతుందని తెలిపారు. అధికారం ఇస్తే విదేశాల నుండి నల్లధనం తెచ్చి, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ పేదలను మోసం చేశారని విమర్శించారు.
బ్యాంకులను ముంచిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను దేశానికి తిరిగి తీసుకురాలేకపోయారని.. 70 ఏళ్ల ప్రజల శ్రమ, చమట చుక్కలతో కాంగ్రెస్ నిర్మించిన వ్యవస్థలను మోడీ ధ్వంసం చేశారని ఆరోపించారు. దేశ ప్రజల సంపదను అదానీకి అడ్డగోలుగా అమ్ముతున్నారన్న రేవంత్.. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచేసి పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అనే ప్రశ్నే ఉండదని నమ్మబలికి.. దేశంలో మరింత బ్లాక్ మనీ వ్యాప్తికి కారకులయ్యారని విమర్శించారు.
దేశంలో నయా బ్రిటీష్ పాలన నడుస్తోందన్న రేవంత్.. దానిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. ఇది సహించలేకనే ఈడీ నోటీసులతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని మోడీ భావిస్తున్నారని అన్నారు. అది జరిగే సమస్యే లేదని.. పోరాడుతాం.. గెలుస్తాం… దేశాన్ని గెలిపిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు రేవంత్ రెడ్డి.